23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

తెలంగాణా సమస్య(Part 1) - ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ?


తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎందుకడుగుతున్నారు? దేశం మీద ఈ అంశం ప్రభావం ఎలా ఉంటుంది? సమైక్య రాష్ట్రం మీదగానీ, రెండు ప్రత్యేక రాష్ట్రాల మీదగానీ దీని ప్రభావం ఏవిధంగా ఉండబోతుంది? అసలీ సమస్య ఇంత జఠిలంగా ఎందుకు తయారయ్యింది? ప్రాంతాల వారీగా కాకుండా అసలు ఈ విషయం మీద వివిధ పార్టీల ఆలోచనా విధానం ఏంటి? తప్పో రైటొ ఇప్పుడున్న పరిస్థితి నుండి మార్గాంతరాలేంటి? ప్రత్యేక రాష్ట్రం వద్దనే వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు?

అన్నీ ప్రశ్నలే. సమాధానాలెక్కడ? నాకు వీలయినంత వరకూ నిష్పక్షపాతంగా(?) ఈ విషయం మీద నా ఆలోచనలు రాద్దామంటే, ఒక టపా సరిపోయేట్టులేదు. సరే వీలయినంతవరకూ మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే వరకూ వరసగా టపాలు రాద్దామని నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయాలు చెప్పి మంచి చర్చ చేస్తారని ఆశిస్తున్నాను.

ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ?

అసలు ప్రత్యేక రాష్ట్రం ఎందుకడుగుతున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అనేక వాదనలూ, విశ్లేషణలూ చూస్తే స్థూలంగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కి కారణాలు 5. ఈ కారణాలన్నిటినీ పరిశీలిస్తే, అర్థమయ్యేదేంటంటే, ఇందులో కొన్నేమో గణాంకాల ఆధారంగానూ, డాక్యుమెంట్ల ఆధారంగానూ విశ్లేషణ చెయ్యడానికి వీలయ్యేవీ, మరికొన్నేమో అలా వీలు కానివీ. ఇందులో కొన్ని ఎక్కువా కొన్ని తక్కువా అనేదేమీ లేదు నాదృష్టిలో. అన్నీ బలమైన కారణాలే. వీటిల్లో నిజానిజాల్నీ, అపోహలనీ బేరీజు వేద్దాం.

ఎవరికి వీలయిన గణాంకాలు వాళ్ళు తీసుకొచ్చి, మధ్యలో ఒక కారణం నుంచి ఇతర కారణాల వైపు చర్చని దారి మళ్ళిస్తూ కలగాపులగం చెయ్యటం అనేది విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో గత కొన్నేళ్ళుగా జరుగుతున్న తంతే. మళ్ళీ మనమెందుకు అదే చెయ్యటం!! మనం అన్ని కారణాలనీ ఒక్కొక్కదాన్నీ విడివిడిగా, సరళంగా విశ్లేషిద్దాం.

1. తెలంగాణా ప్రాంతం అభివృధ్ధిలో వెనకబడి ఉండటం

ఇది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన కారణమా కాదా అనేది కాసేపు పక్కనపెడదాం. ఎందుకంటే, ముందు వెనకబాటుతనం ఉంది అని నిరూపణ అవ్వాలి, తరవాత వెనకబాటుతనం ప్రత్యేక రాష్ట్రంగా లేకపోవడం వల్లే అని నిర్ధారింపబడాలి. ప్రభుత్వం వారి లెక్కలు గానీ లేదా అదే పనిగా ఈ విషయం కోసమే నియమించబడ్డ శ్రీక్రిష్ణ కమీటీ లెక్కలుగానీ చూస్తే 1956 తరవాత జరిగిన అభివృధ్ధిలో ఈ ప్రాంతం వెనకబడి లేదనేది కనిపిస్తుంది. స్థూలంగా వెనకబాటుతనం ఉన్నా అది అన్ని ప్రాంతాలలోనూ ఉంది. 1956 తరవాత హైదరాబాదు లో అన్ని ప్రాంతాల పెట్టుబడిదారుల డబ్బు వల్లా అన్ని ప్రాంతాల ప్రజల శ్రమ వల్లా ఎక్కువగా అభివృధ్ధి జరిగిందనేది నాకైతే బాగానే కనిపించింది.

2. ఆర్థికాంశాల్లోనూ, పరిపాలనాంశాల్లోనూ ఈ ప్రాంతం నిర్లక్ష్యం చెయ్యబడుతూ ఉంది

ప్రభుత్వ పరంగా జరిగిన కేటాయింపులూ, ఇతరత్రా వివరాలు చూస్తే ఈ కారణం కూడా పెద్దగా నిలబడలేదనే చెప్పొచ్చు. నీటి లభ్యత మాత్రం తక్కువగానే కనిపిస్తుంది. ఉద్యోగాల విషయంలో ప్రైవేటు ఉద్యోగాల విషయంలో ఈ ప్రాంతవాసులకి మిగతావాళ్ళతో పోలిస్తే తక్కువ ఉద్యోగాలు లభించిన మాట వాస్తవమే అయినా, అది ప్రత్యేక రాష్ట్ర అంశానికి సంబంధం లేని విషయమే. నీటి వనరుల విషయంలో మాత్రం తేడా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే, ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ ఫలితాలు సాధించడం కంటే, ఈ ప్రాంతానికి వీలైన ఇతర రంగాల్లో నిధులు పెట్టి మంచి ఫలితాలు సాధించడమే మంచిది కదా ! ప్రకాశం జిల్లా గానీ, లేదా గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు గానీ ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. దాన్నీ నిర్లక్ష్యం అనలేము కదా !

3. 1956 లో ఒకే రాష్ట్రంగా ఏర్పడినప్పుడు చేసిన ఏర్పాట్లేవీ చిత్తశుద్దితో అమలు జరగలేదు కాబట్టి ఇక ముందైనా మధ్యేమార్గంగా చేసే ఏర్పాట్ల మీద ఈ ప్రాంత ప్రజలకి నమ్మకం లేదు.

శ్రీక్రిష్ణ కమీటీ ప్రకారం చూసుకున్నా మరే ఇతర ఆధారాల ప్రకారం చూసినా ఒప్పందాలు సరిగ్గా అమలు చెయ్యబడలేదు అనేది మాత్రం స్పష్టం. అసలు ఆ ఒప్పందాల్లోని షరతులే తప్పు కాబట్టి అవి అమలు జరక్కపోయినా తప్పేంలేదు అనే వాదన అర్థ శతాబ్దం తరవాత ఇప్పుడు చెయ్యడం మాత్రం అర్థంలేని పని. ఒకవేళ ఇప్పుడేదైనా పకడ్బందీ ఏర్పాటు చేద్దామన్నా ఈ ప్రాంత ప్రజలు దాన్ని విశ్వసించడానికి సిధ్ధంగా లేకపోతే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ పరిస్థితుల్లో ఎవరున్నా అంతే కదా !

కేవలం ఒప్పందాల అమలులో లోపాలవల్లే తెలంగాణా కోసం ఇంత పోరాటం చేస్తున్నారా ? ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంత పోరాటం ఎందుకు జరుగుతున్నట్టు ? మిగతా ఏవైనా కారణాలుండే ఉండాలిగా. అయితే వాటిని ఇదమిధ్ధంగా తేల్చడం గణాంకాలూ, డాక్యుమెంట్ల తో అయ్యేపని కాదు. కానీ అవేమీ తక్కువ చేసి చూడాల్సిన అంశాలేం కాదని నేను అనుకుంటున్నాను.

4. సమైక్య రాష్ట్రంలో తెలంగాణా ప్రాంత ప్రజల ఆకాంక్షలకీ, ఆశలకీ, సమర్ధతకీ సరైన అవకాశాలు దొరకడం దుర్లభం అనే భావన

పైన చెప్పబడిన మొదటి రెండూ అంశాల ప్రకారం చూస్తే, ఈ భావన కలగడం ఎలా సాధ్యం ! కానీ ఈ భావనా, అభద్రతా చాలా బలంగానే ఉంది ఈ ప్రాంతంలో. ఏమై ఉండొచ్చు ? తెలంగాణా మీద మిగిలిన ప్రాంతాల సాంస్కృతిక ఆధిపత్యం వల్ల అవకాశాలూ తగ్గి ఇటువంటి భావన ప్రబలే అవకాశం ఉంది. మొదటి రెండూ అంశాల్లో కూడా గణాంకాల ప్రకారం అంతా సవ్యంగానే ఉన్నా, ఈ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఇంత బలంగా ఉందంటే, బహుశా గణాంకాల్లోని న్యాయం ప్రజలకి అనుకున్నంతగా అందలేదేమో !!

5. ఈ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉంది. పరిపాలనాపరంగా బానే ఉండి మిగిలిన వారికి నష్టం లేనప్పుడు ఎందుకివ్వకూడదు?

ఇదికూడా ఒక రకంగా బలమైన వాదనే. ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉందనేది నిజమే. ఇక తేలాల్సింది, పరిపాలనా పరంగా బానే ఉంటుందా మిగిలిన వారికి ఏమైనా నష్టాలున్నాయా అనే రెండు విషయాలు. అధికార వికేంద్రీకరణ అనే సూత్రం ప్రకారం మంచిదేగానీ, ఒక రాష్ట్ర ఏర్పాటు మాత్రమే దానికి పరిష్కారం కాదు. స్థానిక సంస్థలని రాజ్యాంగ ప్రకారం నడిపితే ఇంకా మంచి ఫలితాలొస్తాయి. కాకపోతే ఆ పని సమైక్య రాష్ట్రంలో ఇప్పటివరకూ అనుకున్నంతగా జరగలేదు. అదట్లా ఉంచితే, దాదాపుగా 4 కోట్ల మంది జనాభా ఉన్న ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే పరిపాలనా పరంగా గానీ, వనరుల పరంగా గానీ బానే ఉంటుందనిపిస్తుంది.

ఏమీ నష్టం లేకుండానే మిగిలిన ప్రాంతాల్లో అంత వ్యతిరేకత ఎందుకుంటుంది? ముఖ్యంగా ఉపాధి అవకాశాలుగానీ, పెట్టుబడికి అనుకూలతలుగానీ హైదరాబాదు లో మాత్రమే ఉన్నాయి. మిగిలిన చోట్ల అటువంటి అవకాశాలు కల్పించడంలో సమైక్య రాష్ట్రం విఫలమవ్వడం వల్ల హైదరాబాదుని ఒక్కసారిగా ఒదులుకోవడం మిగిలిన ప్రాంతాల వారికి ఖచ్చితంగా నష్టమే, అభ్యంతరకరమె. మిగిలిన అంశాల విషయానికొస్తే, నీటి విషయంలోగానీ, హైదరాబాదు నుండి సమైక్య రాష్ట్రానికి ఒనగూరుతున్న ఆర్థిక వనరులనన్నిటినీ కోల్పోవడమంటే అది మిగిలిన ప్రాంతాలకి తప్పకుండా నష్టం కలిగించే అంశమే. మరీ ముఖ్యంగా తెలుసుకోవలసిందేంటంటే, రాష్ట్ర రాజధాని కాబట్టే ఇక్కడ మాత్రమే మిగిలిన ప్రాంతాలకంటే ఎక్కువ అభివృధ్ధి జరుగుతున్నా ఇంత కాలంగా అందరూ దాన్ని సహిస్తూ, సహకరిస్తూ వచ్చారనేది నిర్వివాదాంశం. కేవలం హైదరాబాదు మాత్రమే అభివృధ్ధి చెందడం అనేది తప్పైనా, ఇప్పుడు మనమున్న వాస్తవ పరిస్థితి మాత్రం ఇదే.

ఇవి కాకుండా ఇంకేవైనా కారణాలు నేను గమనించలేకపోయున్నా, ఈ కారణాలని అర్థం చేసుకోవడంలో పొరపాట్లున్నా మీ అభిప్రాయాలు చెప్పండి.


హిందూయిజం అంటే ??


ఇదేమీ బాగా ఆలోచించి ఆ ఆలోచనలని చర్చకి పెట్టే టపా కాదులెండి. ఈ కింది ఫోటో చూడగానే మనసుకి అనిపించింది రాస్తున్నానంతే. వెయ్యి సంవత్సరాల నుండీ ముస్లీములు హిందువులని అణగదొక్కారనీ, హిందువులు ముస్లీంల మీద ఆధిపత్యం కోసమే ప్రయత్నిస్తున్నారనీ, ఈ దేశం హిందువులది మాత్రమే అనీ, కాదు అందరిదీ అనీ రకరకాల వాదనలు చేసే వాళ్లంతా ఇదొక్కసారి చూస్తే తమ వాదనలని సరిచూసుకునే అవకాశం దొరుకుతుందనే ఆశ, అంతే. ముఖ్యోద్దేశ్యం మాత్రం ఈ ఫోటోని అందరితో పంచుకోవడమే.





సుప్రీం కోర్టు చెప్పినట్టు, హిందూయిజం అనేది ఒక జీవన విధానం మాత్రమే అంతకంటే ఇంకేమీ కాదు.

మిత్రుడు సీతారం ఫేస్ బుక్ లోనుండి తీసుకున్నాను ఫొటొ. Thank you Sitaram RNV. You made my day :)

19, సెప్టెంబర్ 2011, సోమవారం

పిల్లి అంతరంగం - గోడెందుకెక్కాల్సొస్తుందంటే...

గోడకి ఇరువైపులా ఉన్న గొర్రెలు అవతలి వైపు వాటిని తోడేళ్ళని ప్రగాఢమైన నమ్మకంతో దూసుకెళ్ళిపోతా ఉంటాయి.

ఇంతలో ఒక పిల్లి, బాబూ ఈ వైపు కూడా తోడెళ్ళున్నాయి అలాగే ఆవైపు కూడా కొన్ని తోడేళ్ళున్నాయి మనం జాగ్రత్తగా ఆలోచించి రెండు వైపులా ఉన్న గొర్రెల్ని కాపాడుకోవాలి, అని చెప్తే..

చస్స్.. ఇవన్నీ అయ్యేపనులు కాదు, అవతలి వైపు తోడేళ్ళున్నాయా లేదా సూటిగా చెప్పు అంటాయి.

ఉన్నాయి కాబట్టి, సత్వర పరిష్కారం ఏంటంటే, అవతలి వైపు వాటినన్నిటినీ వధిస్తే ఇటువైపున్న అమాయక గొర్రెలం మనమంతా హాయిగా ఉండొచ్చు అని తీర్మానించినంత పని చేశాయి. అవతలివైపు గొర్రెలు కూడా ఉన్నాయి మొర్రో అని పిల్లి నెత్తినోరూ బాదుకుంటుంటే..

కొన్ని తెలివైన గొర్రెలొచ్చి.. అవతలి వైపు తోడేళ్ళొచ్చి మనలో కొన్ని గొర్రెల్ని తిన్నాయా లేదా ? అని అడిగాయి.

అవును అంది పిల్లి పాపం.

అవతలి వైపు గొర్రెలుంటే ఆ తోడేళ్ళు ఇటెందుకొస్తాయే తెలివిలేని పిల్లీ. అవతలివైపువన్నీ తోడేళ్ళే అని నీలాంటి మేతావి బుర్రలకి అర్థంకాదులే నోర్మూసుకోని చెప్పింది చెయ్ అంటాయి.

పాపం పిల్లి ఏం చెయ్యాలి ? గోడెక్కితేనే కదా నిజం తెలిసేది ? సరే, నిజం తెలుకుందామని పిల్లి గోడెక్కింది. అంతే.. రెండూ వైపులా ఉన్న తోడేళ్ళు విషయం పసిగట్టి, అదుగో ఆ పిల్లి చూశావా ఎవరు గెలిస్తే ఆవైపు దూకటానికి వీలుగా గోడెక్కింది అని గొర్రెల్ని నమ్మించబూనుకున్నాయి.

పిల్లి ఏం చెయ్యాలి ? కనీసం కొన్ని గొర్రెల్నయినా గోడెక్కించాలి ? అప్పటి వరకూ.. ఏ వైపైతే పూర్తిగా తుడిచి పెట్టుకు పోయే ప్రమాదంలో ఉందో ఆ వైపు మద్దత్తు తెలుపుతూ వ్యవహారాన్ని కొద్దిగా ఆలస్యం చెయ్యాలి. నాకు రెండూ వైపులా తెలుసు కాబట్టి నేను చెప్పేదే న్యాయం అని పిల్లి నమ్మిందనుకోండి.. దానర్థం.. పిల్లి కూడా తోడేలుగా రూపాంతరం చెందుతున్నట్టు. గొర్రెలు గోడెక్కి చూసేదాకా తన ప్రయత్నాలు అలాగే కొనసాగించడమే న్యాయం.

అదండీ పాపం.. మన పిల్లి గారి పిచ్చి లాజిక్కు  ;)   

16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

నరేంద్ర మోడీ.. నరేంద్ర మోడీ.. so.. what's the deal !!

నరేంద్ర మోడి, ఈ పేరే ఒక సంచలనం. చాలా మంది దృష్టిలో హీరో గానో, లేకా అతి దుర్మార్గుడిగానో ముద్ర వేసుకున్నాడు అనడంలో సందేహమే లేదు. దేశ రాజకీయాలనీ, భావోద్వేగాలనీ అత్యంత ప్రభావితం చెయ్యగల అతికొద్ది పేర్లలో ప్రస్తుతం ఇది అతి ముఖ్యమైన పేరు. గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళనీ, అంతే గుడ్డిగా సమర్ధించేవాళ్ళనీ ఇంత మందిని తయారు చెయ్యగలిగాడంటే ఖచ్చితంగా ప్రతిభావంతుడే. నిజా నిజాలూ ఏంటి అనేదాని మీద బోలెడు వాదనలూ దృక్కోణాలూ.. వీటి మధ్యలో మనమేం అర్థం చేసుకోవాలి? నేను చదివిన దాన్నిబట్టీ అర్థం చేసుకున్నదాన్నిబట్టీ ముఖ్యంగా నాకు అర్థమయ్యిన విషయాలేంటంటే:

  1. 2002 లో జరిగిన మారణకాండ కి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ప్రోత్సాహం అందించాడనీ, కావాలనే ఒక వర్గానికి వత్తాసు పలికాడనీ ఉన్న ఆరోపణల్లో కొంత క్రెడిబిలిటీ ఉందనిపిస్తుంది.
  2. గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా అభివృధ్ధి సాధించాడు. (కొన్ని గణాంకాలూ, మీడియా అభిప్రాయాలూ అన్నింటికంటే ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు చూసిన మీదట ఏర్పడిన అభిప్రాయం )
  3. సమర్ధవంతమైన, బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్న రాజకీయవేత్త (వ్యక్తిగతంగా డబ్బు కోసం అవినీతికి పాల్పడడు అని జరుగుతున్న ప్రచారంలో కూడా కొంత క్రెడిబిలిటీ కనిపిస్తుంది)

ఇంక మోడీ గురించి అభిప్రాయాలు వ్యక్తం చేసేవాళ్ళు వేరు వేరు దృక్పధాల్లో వ్యక్తం చేస్తున్నారు. కొంత మందేమో మాకు మొదటి దాంట్లో మోడీ ప్రవర్తన ఎంతమాత్రం సమ్మతంకాదు కాబట్టి మిగిలిన రెండూ అంశాలతో మాకు పనిలేదు అనే వాళ్ళు. ఇంకొందరేమో..ఏదో 2002 లో జరిగి పోయింది. మిగిలిన రెండు అంశాల్లో బానే ఉన్నాడుగా దాన్ని బట్టి చూద్దాం అంటారు.
పై రెండు వాదాలతో పెద్దగా పేచీ లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. పరిస్థితులనిబట్టీ , అవగాహననిబట్టీ, దృక్పధాలు మారుతుంటాయి. అది వాళ్ళ అభిమతానికే వదిలేయవచ్చు. నాకొచ్చిన చిక్కల్లా పై రెండూ కాకుండా వేరే వాదనలు చేసే వాళ్ళతోనే..
  • మొదటిదాంట్లో మోడీ చేసింది సరైనదే. మాకు ఆవిషయం మీదే మోడీ గొప్ప అంటారు.
  • మొదటి కారణం వల్ల మాకు మోడీ నచ్చడు కాబట్టి, అసలు మోడీ ఇతర సుగుణాలని గుర్తించటం మాట అటుంచి చూడటానికీ, వినటానికీ కూడా మేం ఒప్పుకోం అంటారు. అసలవి లేనే లేవని వాదిస్తారు. వీళ్ళ వాదనలోని డొల్లతనాన్ని మోడీకి ఒకరకమైన మద్దత్తుగా ఉపయోగించాలనుకునే వాళ్ళూ ఉన్నారనుకోండి.

ఇంత గందరగోళం మధ్య స్పష్ఠత రావాలంటే ఆలోచించాల్సినవిషయాలు చాలా ఉన్నాయి. ఏ సమర్ధతా లేకుండానే ప్రజలు ప్రతిసారీ మోడీని గెలిపిస్తున్నారా? గెలిపిస్తున్నారు అంటే, ప్రజలు 2002 మారణకాండ విషయంలో మోడీ పాత్ర లేదని నమ్మినట్టేనా ? మారణకాండ విషయంలో మోడీ వైఖరికి ప్రజలు మద్దత్తు ఇచ్చారనా ? మారణకాండ విషయంలో తప్పు జరిగినప్పటికీ, మిగిలిన విషయాల్లో మోడీ ప్రతిభా పాటవాలకి విలువిచ్చి గెలిపిస్తున్నారనా ? మారణకాండ విషయంలో వ్యతిరేకించినా, మోడీ లా మెరుగైన పరిపాలన అందించేవాళ్ళు లేకపోవడం వల్ల, అటువంటి ప్రత్యామ్నాయం దొరికేవరకూ ఇదే మంచిది అనుకొనా?
గుజరాత్ లో ప్రజలు మతాల వారీగా పూర్తిగా విడిపోయుండటం వల్లే ఇది జరుగుతుందా ? నా దృష్టిలో ఇది ఇంతకాలం సాధ్యం కాకపోవచ్చు. మతాలవారీ ఉన్మాదం కొన్ని సందర్భాలలో ఉంటుందనేది వాస్తవమే అయినా, ఇంత దీర్ఘకాలం అది అలాగే నిలిచిఉంటుందనేది నమ్మడమంటే నాకైతే, ఈ దేశ ప్రజల్ని అవమానించడమే అనిపిస్తుంది.
పై ప్రశ్నల్లో మనకీ, మన వాదనలకీ ఏది అనుకూలంగా ఉంటే దాన్ని నమ్మటం సహజంగా చాలా మందికి ఉండే బలహీనతే. అందులో తప్పులేదు. ఆ బలహీనతని అధిగమించేలా ప్రజని చైతన్య పరచడం సరిగ్గా చెయ్యగలిగే నాయకుల్ని తాయారు చేసుకోలేకపోవడం మనందరి ఫెయిల్యూర్. సరే.. నేను చెప్పాలనుకుంటున్న దాన్ని సూటిగా చెప్పాలంటే:
మోడీ వ్యతిరేకులకి:
  • ఒకవేళ 2002 మారణకాండలో మోడీ వైఖరి గనుక చాలా మంది ఆరోపించినట్లుగా ఉండి ఉన్నట్టయితే, ఒక సమాజంగా మనం దాన్ని నిర్ద్వందంగా గర్హించాల్సిందే. అదే సమయంలో మోడీ అందించే పరిపాలనకి ధీటైన ప్రత్యామ్నాయం మేమివ్వగలం అని మోడీని వ్యతిరేకించేవాళ్ళు ప్రజల్లో విశ్వాసం నింపగలగాలి. అప్పటివరకూ మోడీ చేసే పరిపాలన గురించి నిష్పక్షపాతంగా సద్విమర్శలు చేస్తూ, 2002 లో మోడీ చేసింది ఎంత ప్రమాదకరమైనదో, అటువంటి వాటిని ఎందుకు వ్యతిరేకించాలో ప్రజలకు వివరించాలి.
  • మోడీ చేస్తున్న పరిపాలననీ అభివృధ్ధినీ లేదన్నట్టుగా ప్రవర్తించడం మానుకోవాలి.

 మోడీని సమర్ధించే వారికి:

  • 2002 ని వదిలేసి, పరిపాలన విషయంలో బావుంది కదా, దాని మీదే మోడీ ని అంచనా వేద్దాం అనేది సరైన ఆలోచన కాదు. ఒకవేళ అలా జరగాలంటే, మోడీ నిజాయితీగా, 2002 లో తన మీద ఆరోపించబడుతున్న విధమైన ఆలోచనలు, దుశ్చర్యలూ తప్పు అని నమ్మి దాన్ని ప్రజలకి నమ్మకంకలిగేలా పశ్చాత్తాపం ప్రకటించగలిగితే, అప్పుడు కుదురుతుంది.  
  • జరిగిన అభివృధ్ధి మాటున 2002 ఘాతుకాలని సమర్ధించే ప్రయోగాలు మానుకోవాలి.
------------------------------------------------------------------
మారణకాండకి వత్తాసు పలికిన విషయంలో నేనైతే మోడీకి బద్దవ్యతిరేకిని. వ్యతిరేకించినంత మాత్రాన మోడీలో ఉన్న మిగతా మంచి లక్షణాలని చూడలేక కళ్ళుమూసుకోవడం మాత్రం నా వల్ల అయ్యే పనికాదు. మిగతా అంశాల్లో బానే ఉన్నాడుకదా అని, 2002 ప్రవర్తనని ఉదారంగా మర్చిపోవడమూ లేదా అసలదేమీ జరగలేదన్నట్టు నటించడమూ నావల్ల అయ్యే పనికాదు.

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

అన్నా హజారే ఉద్యమం-అసలు కారణాలు-గుణపాఠాలు

ఈ ఉద్యమం అవసరం లేదనీ,సరైన దారిలో నడవట్లేదనీ, రాజకీయ నాయకులు దీన్ని కూడా ఎలాగోలా నీరుగారుస్తారనీ అనేక సందేహాలూ, దీని వల్లైనా కొంత మేలు జరుగుతుందనే ఆశల మధ్య దేశాన్ని ఉర్రూతలూగించిన ఈ పరిణామాలన్నింటినీ గమనించినప్పుడు మనం గానీ మన రాజకీయ వ్యవస్థ గానీ అర్థం చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

ఎవరెన్ని చెప్పినా, ఎన్ని రకాల పొరపాట్లున్నా మొత్తం మీద ఈ ఉద్యమం చాలానే మంచి ఫలితాల్ని సాధించిందనేది కాదనలేని విషయం. ఈ ఉద్యమాన్నీ, కారణాలనీ, ఫలితాలనీ సరిగ్గా అర్థం చేసుకోకుండా ఒక విజయంగానో లేకా ఒక అనుకోని పరిణామంగానో మాత్రమే చూస్తే పెద్దగా ఉపయోగం ఉండదు.

ఈ ఉద్యమం సాధించిన మంచి ఫలితాలు:
  1. అవినీతి మీద ప్రజల్లో ఉన్న ఏవగింపూ, ప్రజల దృష్టిలో ఈ సమస్యకున్న ప్రాధాన్యతా చాలా ఎక్కువ అనేది స్పష్టంగా బయటకొచ్చింది  
  2. వివిధ కారణాల వల్ల సామాజిక చైతన్యం అంతగా కనపరచని అనేక మందిలో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది 
  3. జాతీయ స్థాయిలో అవినీతి అనే సమస్యని ఎదుర్కోవడానికి ఎంచుకోవలసిన మార్గాలూ, సత్వర చర్యలూ ఏంటనే చర్చ ప్రారంభమయ్యింది
  4. ఒక పటిష్ఠమైన లోక్ పాల్ చట్టం తయారవ్వడం ఖాయంగా కనిపిస్తుంది
 ఈ ఉద్యమం ఇంతగా సఫలమవ్వడానికి ముఖ్య కారణం ప్రజల మద్దత్తు. జనలోక్ పాల్ బిల్లు కోసమే ఇంత మద్దత్తు వచ్చిందా ? హజారేకి మద్దత్తు తెలిపిన ప్రజలందరూ నిజంగా జనలోక్ పాల్ బిల్లు అవినీతిని అంతం చేసే ఏకైకమార్గంగా నమ్ముతున్నారా ? ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రజా స్పందనకి కారణాలేంటి ? ఎన్నో మంచి ప్రయత్నాలకి అనుకున్నంతగా స్పందించని ప్రజలు ఈ ఉద్యమానికి ఎందుకు ఇంతలా స్పందించారు ? ఉద్యమం నడిపేవాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ఠ వల్లే ప్రజలకి నమ్మకం కుదిరిందా ? అవినీతి విషయంలో పరిష్కారాల మీదా వాటిల్లో హజారే బృందం సూచించినదే అత్యుత్తమమైనదనే అవగాహన మద్దత్తుదారులకి ఏర్పడిందా ?
అనూహ్యమైన ఈ స్పందన కేవలం లోక్ పాల్ చట్టం, అదీ హజారే బృందం సూచించిన జనలోక్ పాల్ కోసమే అని నాకైతే అనిపించట్లేదు. ఈ స్పందన ఎన్నో లోతైన విషయాల్ని సూచిస్తుందనిపిస్తుంది.

ప్రజాస్పందనకి అసలు కారణాలు:
  1. రాజకీయ నాయకుల మీదా, పార్టీల మీదా ప్రజల్లో ఉన్న అపనమ్మకం  
  2. పై స్థాయిల్లో జరిగే అవినీతిని అంతం చేసే ఒక శక్తివంతమైన నియంత(దాదాపుగా) అవసరం అనే నిస్పృహ
  3. సుప్తచేతనావస్థలో ఉన్న మధ్యతరగతి సామాజిక చైతన్యానికి సరైన అవకాశాలు లేకపోవడం
  4. విలువల్లేని రాజకీయాలూ, వినే లక్షణం లేని పరిపాలనా వ్యవస్థ మీదా ప్రజల్లో గూడుకట్టుకున్న నిరసన
  5. నత్తనడక నడిచే న్యాయ వ్యవస్థ మీద ఉన్న కసి.
ఇలాంటి అనేక లోతైన కారణాల బాహ్య స్వరూపమే ఈ ఉద్యమానికి లభించిన స్పందన. అంతిమంగా ఏం జరిగిందనేదాన్ని కాసేపు పక్కనబెట్టి, ఉద్యమం దాని తీరుతెన్నులూ పరిశీలించినప్పుడు కొన్ని పొరపాట్లూ ప్రమాదకర పోకడలూ మౌలికమైన తప్పులూ కనిపించాయనడంలో తప్పులేదు.

ఉద్యమం లో పొరపాట్లు:
  1. ప్రజాస్వామ్యంలో మనకేంకావాలో మనమేం అనుకుంటున్నామో చెప్పే హక్కు ప్రజలకెప్పుడూ ఉంటుంది. దాన్నెవరూ కాదనలేరు. కాకపోతే, తాము చెప్పిందే జరిగితీరాలనీ, తామే దేశప్రజలందరి ఆలోచనలకీ ప్రతినిధులమనే స్థాయికి ఉద్యమం వెళ్ళుండకూడదు.
  2. అసలు జన లోక్పాల్ గురించీ, అవినీతిని కట్టడి చేసే మార్గాల గురించీ జరిగే పోరాటం కాస్తా రాజకీయ వ్యవస్థకీ, పౌర సమాజానికీ జరుగుతున్న యుద్ధంలా మారుండకూడదు
  3. ఎన్నో లోపాలుండవచ్చు కానీ, మనకందరికీ అత్యంత విలువైనది మన ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది విస్మరించకూడదు.
ప్రభుత్వం వైపు నుంచి తప్పులు/పొరపాట్లు:
  1. హజారే బృందంతో కలిసి చట్టాన్ని డ్రాఫ్ట్ చెయ్యబోవడం. తరవాత పార్లమెంటరీ వ్యవస్థ గొప్పదనం గురించి గొతు చించుకున్న ప్రభుత్వానికి ఈ బుద్ధి ముందే ఉండాల్సింది.
  2. హజారేని అరెస్ట్ చెయ్యడం, ప్రజాస్వామ్యం గురించీ రూల్ ఆఫ్ లా గురీంచీ తమకవసరమైనప్పుడు మొసలి కన్నీరు కార్చే ప్రభుత్వానికి ఈ పని చేసేటప్పుడు గుర్తు రాలేదా ఇవన్నీ ?
రాజకీయ వ్యవస్థ ఫెయిల్యూర్:
  1. అసలు ఇంతమంది రాజకీయ వెత్తలుండీ ఇంత అత్యవసరమైన సమస్య కళ్ళముందున్నప్పుడు, ఏదో ఒక రాజకీయ శక్తే ఈ ఉద్యమం ఎందుకు చెయ్యలేదు ? 
  2. తీరిగ్గా వచ్చి హజారే ఆరోగ్యం, పార్లమెంట్ సార్వభౌమత్వం గురించి చెప్పడం కాకుండా అన్ని పార్టీలూ కలిసి లోక్ పాల్ చట్టం గురించి మంచి ప్రతిపాదనని ఎందుకు ప్రజల ముందు పెట్టలేక పోయారు? 
  3. ప్రజల్లో రాజకీయ వ్యవస్థ మీదా, నాయకుల మీదా ఇంత అపనమ్మకం, అసహనం, వ్యతిరేకతా ఉందనే విషయాన్ని ఎందుకు గమనించలేక పోయారు ?
పౌర సమాజం ఆలోచించుకోవాల్సిన విషయాలు:
  1. ఇంత పెద్ద ఎత్తున రాజకీయ వ్యవస్థ మీద అపనమ్మకం ఉన్నా ఎందుకు మనల్నెవరూ పట్టించుకోలేదు ? వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తేతప్ప మన అభిప్రాయాల్నీ ఆలోచనల్నీ రాజకీయ పార్టీలు ఎందుకు గమనించ లేక పోయాయి ?
  2. మనమసలు ఈ వ్యవస్థలో పాల్గొంటున్నామా ? రాజకీయాల్ని నిందిస్తూ తప్పించుకు తిరుగుతున్నామా లేదా ?
  3. ఆర్థికంగానూ, విద్య పరంగానూ మనం పొందిన ఉన్నతిని, మేధోపరంగానూ, సామాజికంగానూ ఈ దేశానికి అందిస్తున్నామా లేదా ?
  4. మనకి సరైనది అనే విషయాలకొచ్చేసరికి పద్దతులూ, చట్టాలూ అన్నీ వదిలేసి Mob Justice మాత్రమే సరైనది అనేలా ఆలోచించినప్పుడు మనం మేధోపరంగా ఏ స్థాయిలో ఉన్నట్టు ?
ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ వ్యవస్థ నేర్చుకోవలసిన గుణపాఠాలు చాలానే ఉన్నాయి. వాటిని సరైన రీతిలో నేర్చుకోలేక పోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికీ, పార్లమెంటరీ వ్యవస్థకీ ప్రమాదమే. ఏదో సాధించామనో, ఇంత చేసినా ఏమీ జరగలేదనో ఆలోచన చెయ్యకుండా సరైన రీతిలో దేశ రాజకీయాల్ని అర్థం చేసుకొని అందులో భాగస్వాములవ్వాల్సిన అవసరాన్ని పౌర సమాజం ఇంకా గుర్తించక పోతే అప్పుడొస్తుంది ప్రజాస్వామ్యానికీ, పార్లమెంటరీ వ్యవస్థ కీ అతిపెద్ద ప్రమాదం.
 .