19, అక్టోబర్ 2010, మంగళవారం

వృత్తి ధర్మాన్ని మంటగలిపిన డాక్టరు-మానవత్వాన్ని పంచిన స్వీపరు

నిన్న వార్తల్లో రెండు వేర్వేరు సంఘటనలు మనసుని కలిచి వేసేవి ఉన్నాయి. ఒక దాంట్లోనేమో, ముగ్గురు అక్క చెల్లెళ్ళను (పెద్ద పాప కి మూడేళ్ళనుకుంటా!) జమ్మూ రైల్వే స్టేషన్ లో వదిలేసి వెళ్ళిన తండ్రి. రాం పాల్ అనే సదరు తండ్రి ని వెదికి ఎలాగొ పోలీసులు చివరికి పట్టుకోగలిగారనుకోండి. ఇతగాడు చెప్పేదెమిటంతే, ఆ పిల్లల తల్లి ఒక వివాహేతర సంబంధం కారణంగా కొన్నళ్ళ క్రితం ఎటో వెళ్ళిపోయిందట. ఇతగాడు పిల్లల్ని పెంచలేనని వదిలించుకున్నాడట. పిల్లల్ని తిరిగి స్వీకరించడానికి ఇతగాడు ససేమీరా అంటున్నాడు. ఇక ఆ మహ తల్లి కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి పిల్లల్ని ఒక అనాధాశ్రమంలో ఉంచి తదుపరి చర్యల కోసం పాపం అధికారులు ప్రయత్నిస్తున్నారు.


ఆ స్టేషన్ లో స్వీపర్ గా పనిచేసే గురుదేవ్ సింగ్ ఈ పిల్లల్ని గమనించి, చేరదీసి, అధికారులకు తెలియచేసి, ఆ రాత్రంతా నిద్రపోకుండా వారికి సేవలు చేసారు. వృత్తిధర్మాన్నేకాదు మానవత్వాన్నికూడా నిలబెట్టిన ఇటువంటివాళ్ళే ఆదర్శప్రాయులు.


ఇక రెండో వార్త విషయానికి వస్తే, డాక్టరుగా ఉన్నత చదువులు చదివి సమాజంలో గౌరవం, ధనం బాగా సంపాదించుకున్న ఒక పిశాచి విశృంఖలత్వం మనల్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. అచేతనావస్తలో ఉన్న ఒక రోగితో లైంగిక వాంఛ తీర్చుకున్నాడట కామాంధుడైన ఈ ముంబై డాక్టరు. పవిత్రమైన వృత్తి ధర్మాన్నీ, మానవత్వాన్నీ మంట గలిపాడు.


ఈ రెండు వార్తలూ చదివింతర్వాత బాధతో నిండిన హృదయం, ఆలోచనలోతో నిండిన మనసూ తప్ప, పరిష్కారం సూచించే మెదడు  మాత్రం తాత్కాలికంగా పని చేయడం మానేసింది.

4 కామెంట్‌లు: