21, డిసెంబర్ 2011, బుధవారం

తెలంగాణా సమస్య(Part 2) - అసలేం జరుగుతుంది !!!

అంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నా 09 డిసెంబరు 2009 నుండీ పరిస్థితులు చాలా వేఘంగానూ, నిర్ణయాత్మకంగానూ మారాయి. ఎవరూ ఎవర్నీ నమ్మకపోవడం, ఎవరి వాదానికి వాళ్ళు 100% కమిటవ్వడం, పరిస్థితులు సంక్లిష్టంగా మారడం.. ఇదంతా అర్థం చేసుకోవాలంటే డిసెంబరు 2009 నాటి పరిస్థితుల్నీ తదనంతర పరిణామాలనీ చాలా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

07 డిసెంబరు 2009: అన్ని పార్టీలు తెలంగాణా ఏర్పాటుకి సైధ్ధాంతికంగా మద్దతు ప్రకటించాయి. కనీసం అభ్యంతర పెట్టడమైతే చెయ్యలేదు.
09 డిసెంబరు 2009: కేంద్ర ప్రభుత్వం, దాదాపుగా తెలంగాణా ఏర్పాటు చేసినంత ప్రకటన ఇచ్చింది.
10 - 23 డిసెంబరు 2009: సీమాంధ్ర ప్రతినిధుల రాజజీనామాలు(దాదాపు అన్ని పార్టీల వాళ్ళూ), సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రజారాజ్యం పార్టీ తన విధానాన్ని సమైక్యవాదిగా మార్చుకోవడం
23 డిసెంబరు 2009: విస్తృతమైన సంప్రదింపులు అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం
24 డిసెంబరు 2009 - 05 జనవరి 2010: మళ్ళీ తెలంగాణా ఉద్యమం
ఫిబ్రవరి 2010 - జనవరి 2011: ఉద్యమంలోనూ, ఉద్యమాన్ని వ్యతిరేకించే వాళ్ళలోనూ కొంత స్తబ్దత, శ్రీక్రిష్ణ కమిటీ అభిప్రాయ సేకరణ చెయ్యటం
జనవరి 2011 నుండి: మళ్ళీ కేంద్రం ఎటూ తేల్చక పోవటం, ఉద్యమం ఊపందుకోవటం, ఆవేశాలూ, సమ్మెలూ, సవాళ్ళూ, ప్రతిసవాళ్ళూ ఇంతే కాకుండా అర్థం లేని రాజీనామాలూ వాటికి అంతకంటే అర్థంలేనీ, అర్థం కాని తిరస్కరణలు.

ఈ దశలన్నీ చూసినప్పుడు కొన్ని ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే:

1. డిసేంబరు 7 న ఏ అభ్యంతరమూ వెలిబుచ్చని సీమాంధ్ర ప్రతినిధులు మూడురోజుల తరవాత ఎందుకలా ప్రతిస్పందించారు?

డిసెంబరు 7 న పార్టీలన్నీ చెప్పిన దాని ప్రకారమైతే డిసెంబరు 9 ప్రకటన అంత ఆగ్రహం తెప్పించే విషయం కాదు. కాని తప్పకుండా సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో చాలా నిరసన వ్యక్తం అయ్యింది. నాదృష్టిలో ఆ నిరసన అసలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కంటే, ప్రకటన చేసిన విధానం మీదే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి ఉన్న పరిస్థితుల్లో ఆప్రకటన రావడం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణా వాదుల పక్షపాతిగానూ, సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలకి విలువ ఇవ్వనట్టుగానూ కనిపించింది.

అలా అయితే మరి 7వ తారీఖున సీమాంధ్ర ప్రతినిధులు ఎందుకు ఒప్పుకున్నట్టు !! అసలప్పటికే దాదాపు అన్ని ముఖ్య పార్టీలూ తెలంగాణా ఏర్పాటుకి తమ మద్దత్తు ప్రకటించి ఉండటం ఒక రాజకీయ కారణమైతే, అసలు నిర్ణయం తీసుకోబోయే ముందు ప్రజాభిప్రాయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారు అప్పుడు చూసుకోవచ్చులే అనే అలసత్వం కారణం కావచ్చు.

2. చేసిన తప్పు దిద్దుకునే పనిలో భాగంగా విస్తృత స్థాయి చర్చలు జరగాలని కేంద్రం ప్రకటించింది. శ్రీక్రిష్ణ కమిటీ ఏర్పాటు ఆ ప్రకటనకి కొనసాగింపే.

కమిటీ మాత్రమే కాదు ఇంకా ఈ ఈ పద్దతుల్లో విస్తృత చర్చలు చేస్తాము అని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి, కమిటీ రిపోర్టు తరవాత స్పష్టంగా స్పందించవలసింది కేంద్రమే. కనీసం ఒక రోడ్ మ్యాప్ అన్నా ఇవ్వాలి. ఏమీ చెయ్యకుండా సంవత్సరం పాటు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఇరువైపుల ప్రజల సహనానికి ఉండే హద్దుల్ని పరిక్షించటం కాకపోతే మరేంటి? సంతోషించాల్సిన విషయమెంటంటే, ఈ సహన పరిక్షలో రాష్ట్రప్రజలు చాలా వరకూ విజయం సాధించారనే చెప్పుకోవచ్చు (ఇరుప్రాంతాల వారు కూడా).

3. ఆసలు ఈ విషయం మీద తమకంటూ ఒక విధానం ఏర్పరుచుకున్న పార్టీలు ఏవేవి? అసలు తమ తమ పార్టీలని ఒక విధానం వైపుగా నడిపించే ప్రయత్నాలు చేస్తున్న పార్టీలు ఏవి?

వీటికి సమాధానాలు ఆలోచించగలిగితే జరుగుతున్న పరిస్థితులని సరిగ్గానే అంచనా వెయ్యగలం అనిపిస్తుంది.

1 కామెంట్‌:

  1. >>>డిసెంబరు 7 న పార్టీలన్నీ చెప్పిన దాని ప్రకారమైతే డిసెంబరు 9 ప్రకటన అంత ఆగ్రహం తెప్పించే విషయం కాదు. కాని తప్పకుండా సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో చాలా నిరసన వ్యక్తం అయ్యింది.

    నాకు తెలిసి నిరసన ప్రజల్లో కాక, అక్కడి నాయకులలో ( అదీ ఎమ్మెల్ల్యే , ఎంపి లు మాత్రమె ) మాత్రమె వచ్చినట్లు గుర్తు. లేక మీకు తెలిసిన వివరాలు ఉంటె చెప్పండి.


    >>>అసలు నిర్ణయం తీసుకోబోయే ముందు ప్రజాభిప్రాయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారు అప్పుడు చూసుకోవచ్చులే అనే అలసత్వం కారణం కావచ్చు.

    హ్మ్.. వై ఎస్ ఆర్ ఏ వంచన చేసాక, ఇంకెవరు ఇస్తారు లే కాంగ్రెస్ లో అన్న ధీమా .ఆ మాట కొస్తే ఆ రోజుకి ఎ పార్టీ అధికారం లో ఉన్నా తెలంగాణా ఇవ్వడం జరగకుండా చూస్తారని అందరికీ తెలిసిందే కదా.

    >>3. ఆసలు ఈ విషయం మీద తమకంటూ ఒక విధానం ఏర్పరుచుకున్న పార్టీలు ఏవేవి? అసలు తమ తమ పార్టీలని ఒక విధానం వైపుగా నడిపించే ప్రయత్నాలు చేస్తున్న పార్టీలు ఏవి?

    అధికారం లో లేని తెలంగాణా నాయకులకు, అధికారం లో ఉన్న ఆంద్ర నాయకులకు మాత్రమె తమకంటూ ఒక విధానం ఉంది. తమ పార్టీలను ఒక విధానం వైపుగా నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకెవ్వరికీ లేదు, ఉండబోదు.

    రిప్లయితొలగించండి